Thursday, October 14, 2010

ఈ శిల్పులెవ్వరో..

ఈ శిల్పులెవ్వరో..
ఈ కూలీలెవ్వరో..
పేరులేనోళ్ళు.. ఘనకీర్తి గలవాళ్ళు..

అజంతా ఎల్లోరా అమరావతి చూడు
ఓరుగల్లు హంపి విజయనగరం చూడు
మొహంజదారో హరప్పా చూడు
ఏదేది చూసినా తోచేది ఒక్కటే..
                        .. ఈ శిల్పులెవ్వరో

బండరాళ్ళను వెన్నపూసగా చేసి
అందచందాలున్న బొమ్మలుగ మలిచి
నాజూకు నాజూకు నగీషిలు చెక్కి..
రక్తాన్ని శిల్పముకు రంగుగా రాసిన..
                        .. ఈ శిల్పులెవ్వరో

రాళ్ళనే మీటి రాగాలు పలికించి
రాతిబొమ్మల చేత భావాలు చెప్పించి
హావభావాలలో జీవకళలొలికించి
ప్రాణాలనే బోసి ప్రతిమలుగ చేసిన
                        .. ఈ శిల్పులెవ్వరో

శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి
ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా
కీర్తి రక్షణ కొరకు కోటలను గడితే
కండ కోసి కోట రాళ్ళుగా పేర్చిన
                        .. ఈ శిల్పులెవ్వరో

భాష్యాలు చెప్పే భావనా చిత్రాలు
వెనక చరితను చాటే వెలలేని రత్నాలు
అఖిల భారతదేశ మలరించు శిల్పాలు
ఊరూరునా కళల పేరు మ్రోగించిన                   
                           .. ఈ శిల్పులెవ్వరో

No comments:

Post a Comment